ధర్మ సందేహాలు 2
1). ఏడాది సూతకం(మైల) ఉన్నవారు గుడికి వెళ్ళకూడదా.
జ). మన కాలమానం ప్రకారం మనకు ఒక సంవత్సర కాలం పితృకాలమానం ప్రకారం పితృదేవతలకు ఒకరోజు. గరుడపురాణం కూడా ఇదే చెప్పింది. ఒకరోజైనా పితృదేవతా సంబంధ భావనలకు మనం అనుకూలంగా వ్యవహరించాలయితే ఒక సంవత్సర కాలం మనం ప్రత్యేకంగా మడి, నియమాలు, నిష్ఠతో ఉండాలి. పితృదేవతా ఋణం తీర్చుకునే నిమిత్తం, పితృదేవతలకు కృతజ్ఞతగా సంవత్సరం పాటు వారిని తలుచుకుంటూ కొన్ని కార్యాలు చేయిలి. అలాగే చనిపోయినటువంటి వారికి నిర్వర్తించే విధివిధానాలలో అన్ని ఒకరోజే నిర్వర్తించరు. సంవత్సరకాలం ప్రతీనెలా మాసికాలు వస్తాయి. ఏడాది చివరన సంవత్సరీకం ఆనే కార్యం చేయాలి. అప్పుడే పిండవిమోచనం అవుతుంది. కాబట్టి సంవత్సరం కాలం ఆలయాలలోకి వెళ్ళకూడదు.
2.) పితృపక్షాలలో ఇల్లు మారవచ్చా
జ). పితృపక్షంలో మాత్రం ఇల్లు మారకూడదని ఒక నియమం ఉన్నది. పితృపక్షం మాత్రమే కాదు తద్దినం పెట్టిన రోజున ఇల్లు మారకూడదు. అలాగే మైల ఉండే పదకొండు రోజులు ఇల్లు మారకూడదు. అమావాస్య రోజున ఇల్లు మారకూడదు. మహాలయపక్షాలలో ఇల్లు మారకూడదు. కాబట్టి పితృపక్షాలలో గాని, పితృకార్యాలలో గాని ఇల్లు మారడం, గృహప్రవేశం, శుభకార్యాలు చేయకూడదు. ఇంట్లో కూతురి పెళ్లి గనుక ఉంటే ఇంట్లో పితృపక్షం పెట్టి కూడా కూతురి పెళ్లి చేయవచ్చు
3. సోమవారం పెళ్ళిళ్ళకు మంచిది కాదు అంటారు నిజమేనా.
జ). సోమవారం నాడు పెళ్ళిళ్ళు చేయడమే కాదు, పెళ్లి పనులు ప్రారంభించడం, పెళ్ళికి సంబంధించిన మాటలు మాట్లాడటం కూడా చేయకూడదు. ఒక్కొక్క పని ఒకరోజు చేయాలి ఒకరోజు చేయకూడదు అంటారు. అలాగే సోమవారం నాడు పెళ్ళిళ్ళ ప్రస్తావన చేయకూడదు. సోమవారానికి చంద్రుడు ఆధిపతి కాబట్టి చంద్రగ్రహ ప్రభావం పెళ్ళిళ్ళకు పనికిరాదు.
4. ఉసిరికాయ ఎప్పుడు తినకూడదు.
జ). ఉసిరికాయ రాత్రివేళల్లో తినకూడదు అని శాస్త్రవచనం.
ఆదివారం నాడు, సప్తమి తిథినాడు ఉసిరికాయ తినకూడదు.
5. భోజనం చేసేటప్పుడు ఏ దిక్కుకి తిరిగి భోజనం చేయాలి.
జ). తూర్పుముఖంగా కాని, పచ్చిమముఖంగా కాని కూర్చొని భోజనం చేయాలి.
పితృకార్యాలలో ఉత్తరముఖంగా కూర్చొని భోజనం చేయాలి.
దక్షిణముఖంగా కూర్చుని ఎప్పుడూ భోజనం చేయకూడదు.
6. జున్ను తినకూడదు అంటారు నిజమేనా?.
జ). ఆవు ఈనిన పదకొండు రోజుల లోపల పాలు తీయకూడదు. దానిని స్వీకరించరాదు. స్వీకరిస్తే పాతకం. ఈ విషయం ధర్మశాస్త్రాలలో మహాభారతం లాంటి స్మృతి గ్రంథాలలో కూడా చెప్పబడినది. అందుకే జున్ను తినకూడదు అంటారు.
7. పూజలలో అంచున్న వస్త్రాలనే ఎందుకు ధరించాలి
జ). పూజలలో కాని శుభకార్యాలలో గాని అంచున్న వస్త్రాలనే ధరించాలి. చిరిగిన వస్త్రాలు ధరిస్తే అశుభం కాబట్టి అంచున్న వస్త్రాలనే ధరించాలి. అంచు ఉంది అంటే ఆవస్త్రం చిరగని వస్త్రం. ఇక్కడ చిరిగిన వస్త్రాలు అంటే ప్యాంట్లు చొక్కాలు కూడా చిరిగిన వస్త్రాల క్రిందే లెక్క వాటిని కూడా కట్ చేసే కుడతారు ఇటువంటి వస్త్రాలతో శుభకార్యాలు చేయకూడదు. అంచున్న వస్త్రాలనే ధరించాలి.
8. బ్రాహ్మణుడు గుడిలో పూజలు, ఆభిషేకాలు వెలుపల కర్మక్రియలు నిర్వర్తించవచ్చా
జ). బ్రాహ్మణుడు గుడిలో పూజలు, ఆభిషేకాలు చేస్తూ పవిత్రంగా ఉండాలి. వెలుపల కార్యక్రమాలు చేసుకోవచ్చు కాని పవిత్రతకు భంగం కలుగని రీతిలో ఉండాలి.
ఉదాహరణకు ఒక తద్దినానికి భోక్తగా వెళ్ళాలి. బ్రాహ్మణుడు కాబట్టి వెళ్ళటం ధర్మం. ఇంకెవరూ లేనప్పుడు తనే ఆ కార్యాన్ని నెరవేర్చాలి. అలా వెళ్ళవలసి వచ్చినప్పుడు తాను ముందుగా నివేదన పూర్తి చేసుకుని దైవ కార్యక్రమం పూర్తిచేసుకుని వెళ్లి తప్పదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని మళ్ళీ తరువాత స్నానం చేసి తాను ఆ సాయంత్రం దీపారాధన కలాపం వారి బిడ్డలు చేతో ఇంకెవరిచేతో చేయించి మరుసటి రోజు తాను యజ్ఞోపవీతము మార్చుకుని గాయత్రి జపించి పరిహరం చేసుకుని మరుసటి రోజు నుండి తన పనులు మళ్ళీ మామూలుగా చేసుకోవచ్చు. లేదా
ఏదైనా శుభ కార్యక్రమాలకి వెళ్ళేటట్టైతే ఆ కార్యక్రమం పూర్తిచేసుకుని తన పనులు మళ్ళీ మామూలుగా చేసుకోవచ్చు.
9.అన్న కంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చా
జ). అన్న కంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు.
తమ్ముని కంటే ముందు పెళ్లి చేసుకోని అన్నను పరివిత్తుదంటారు. అన్న కంటే ముందు పెళ్లి చేసుకున్న తమ్ముడిని పరివేత్త అంటారు. పరివిత్తుడు, పరివేత్త అతన్ని వివాహమాడిన కన్య, ఆమె తండ్రి, పెళ్లి చేయించినవాడు నరకమునకు పోవుదురు. కాబట్టి అన్న పెళ్లి చేసుకోకుండా తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు.
10). నువ్వులతో చేసిన పదార్థాలను తినకూడని సమయాలు ఏమిటి
జ).అమావాస్య, పూర్ణిమ, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి తిథులలోనూ ఆదివారంనాడు, శ్రాద్ద దినములలోనూ, నువ్వుల నూనె వంటకు, భోజనాలకు ఉపయోగించరాదు. సూర్యాస్తమయం తర్వాత నువ్వులకు సంబంధించిన ఏ వస్తువులు తినరాదు.
11). నైవేద్య సమయంలో ఘంటానాదం చేయవచ్చా.
జ). నైవేద్య సమయంలో ఘంటానాదం కాని ఇతర నృత్య, గీత, వాయిద్య ధ్వనులు కాని చేయరాదు. అలా చేస్తే రౌరవాది నరకాలు పొందుతారు.
12). సంక్రాంతి దినాలలో (సూర్య సంక్రమణాలు) ఏమి దానం చేయాలి.
జ). మేష సంక్రాంతి నాడు -- మేక
వృషభ సంక్రాంతి నాడు -- ఆవు
మిథున సంక్రాంతి నాడు -- వస్త్రములు, అన్నపానాదులు
కర్కాటకం సంక్రాంతి నాడు -- నెయ్యి, ధేనువు
సింహ సంక్రాంతి నాడు -- గొడుగు, బంగారం
కన్య సంక్రాంతి నాడు -- గృహం, వస్త్రం
తుల సంక్రాంతి నాడు -- నువ్వులు, ఆవుపాలు, నెయ్యి
వృశ్చిక సంక్రాంతి నాడు -- దీపదానం
ధనుస్సు సంక్రాంతి నాడు -- వస్త్రం, వాహానం
మకర సంక్రాంతి నాడు -- కర్రలు, అగ్ని
కుంభ సంక్రాంతి నాడు -- గోవు, నీరు, గడ్డి
మీన సంక్రాంతి నాడు -- భూమి, పూలమాలలు దానం చేయాలి.
13). పూజలో ముద్దగా ఉన్న గంధం, నెయ్యి దేవూడికి సమర్పించవచ్చా
జ). "ద్రవీభూతం ఘృతం చైవ ద్రవీభూతం చ చందనం;
నాఅర్పయేన్మమ తుష్ట్యర్దం ఘనీభూతం తదర్పయేత్"
నేతిని కరిగించినదిగాక ముద్దగా ఉన్నదే దేవునికి సమర్పించవలెను. అదేవిధంగా గంధంగూడా పలుచగా నీటి వలె ఉన్నది గాక ముద్దగా ఉన్నదే దేవునికి సమర్పించవలెను
14). పూజకు ఉపయోగించే పువ్వులు ఎలా ఉండాలి
జ). పూజకు ఉపయోగించే పువ్వులు ఎడమ చేతితో తెచ్చినా, తాను ధరించిన వస్త్రములలో తెచ్చిన్ననూ, జిల్లేడు, ఆముదపు ఆకులలో తెచ్చినను ఆ పువ్వులు ఉపయోగించరాదు.
15).సూతకం ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి
జ). సూతకం ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు
సూతకం ఉన్న పదకొండు రోజులు వైదిక పరమైన, నైమిత్తిక పరమైన, దైవ పరమైన కార్యాలు చేయకూడదు.
సంధ్యావందనం చేయకూడదు.రామాయణ, భాగవతాది గ్రంథాలు పారాయణ చేయకూడదు, అగ్నిహోత్రం చేయకూడదు.
ఇంకా చెప్పాలంటే వారు వంట చేసుకోకూడదు. (బంధువులు లేకపోతే వంట చేసేవారు లేకపోతే మినహాయింపు)
ఇల్లు అంతా కలయతిరగరాదు అశౌచాన్ని ఇల్లు అంతా వ్యాప్తి చేయకుండా ఒక గదిలో ఉండి మాత్రమే వారు అన్ని పనులు చక్కబెట్టుకోవాలి.
శాస్త్ర ఆధారం (ధర్మ సూత్రాలు)
16). భగవంతునికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు
జ). మనం చేసే సమస్త పాప కర్మలు తల కేశములు ను ఆవహించి ఉంటాయి మేము ఇక నుంచి ఎటువంటి దుష్కర్మలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు నా సమస్త పాపములను గుర్తుగా ప్రతీకగా ఉన్న కేశములను నీకే సమర్పిస్తున్నాను నన్ను ఉద్దరించు అని తలనీలాలు సమర్పిస్తారు.
(శిష్ఠాచారం)

No comments:
Post a Comment